
- ఈ నెల 7న వరంగల్ జిల్లా గీసుకొండలో ఘటన
హనుమకొండ, వెలుగు : వరంగల్ జిల్లా గీసుగొండ మండలం స్తంభాలపల్లిలో ఈ నెల 7న జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. డబ్బు, నగల కోసం ఆమె మేనల్లుడే హత్య చేసినట్లు నిర్ధారించారు. కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్కుమార్ శుక్రవారం వెల్లడించారు. వరంగల్ మట్టెవాడ ప్రాంతంలోని రాజీవ్ కాలనీకి చెందిన రేకులపల్లి ప్రణయ్ ప్రైవేట్ జాబ్ జేస్తూ మద్యానికి అలవాటుపడ్డాడు. జల్సాలకు అలవాటుపడిన ప్రణయ్కి జీతం సరిపోకపోవడంతో పెద్ద మొత్తంలో అప్పులు చేశాడు.
అప్పులు తీర్చేందుకు తాళం వేసిన ఇండ్లే టార్గెట్గా చోరీలు చేసేవాడు. ఇలా గీసుగొండ, మట్టెవాడ స్టేషన్ల పరిధిలో నాలుగు దొంగతనాలు చేశాడు. అయినా అప్పులు తీరలేదు. దీంతో తన మేనత్త, గీసుగొండ మండలం స్తంభాలపల్లికి చెందిన స్వరూప (70) వద్ద పెద్ద మొత్తంలో బంగారం, డబ్బు ఉంటుందని భావించి, ఆమె చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా ఈ నెల 7న రెండు బీర్ బాటిల్స్ కొనుక్కొని తన మేనత్త స్వరూప ఇంటికి వెళ్లాడు. సాయంత్రం ఇద్దరూ కలిసి బీర్ తాగారు.
అప్పటికే లేట్ కావడంతో ప్రణయ్ స్వరూప ఇంట్లోనే పడుకున్నాడు. ఆమె గాఢ నిద్రలోకి వెళ్లిన తర్వాత ప్రణయ్ డంబెల్స్తో తలపై కొట్టి హత్య చేశాడు. తర్వాత ఆమె ఒంటిపై ఉన్న సుమారు 17 తులాల బంగారం, 34 గ్రాముల వెండి నగలు తీసుకొని తన ఇంటికి వెళ్లి రక్తం మరకలు అంటిన దుస్తులను తీసివేశాడు. స్వరూపను హతమార్చే క్రమంలో తన చేతికి గాయం కావడంతో వరంగల్ ఎంజీఎంకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నాడు.
హత్య విషయం తెలుసుకున్న వృద్ధురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టారు. టెక్నాలజీ ఆధారంగా స్వరూపను ఆమె మేనల్లుడు ప్రణయే హత్య చేసినట్లు నిర్ధారించారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నిజం ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి రూ.18 లక్షల విలువైన 17 తులాల బంగారం, 3.4 తులాల వెండి, రూ.10 వేలు, బైక్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నామని డీసీపీ అంకిత్కుమార్ తెలిపారు. నిందితుడిని పట్టుకున్న గీసుగొండ, టాస్క్ఫోర్స్ సిబ్బందిని డీసీపీ అభినందించారు.